Congress Party | జైపూర్: రాజస్థాన్ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కీలక నేత సచిన్ పైలట్ మధ్య పోరు ముదురుతున్నది. గెహ్లాట్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సచిన్ స్వపక్షంలోనే విపక్షంలా తయారయ్యారు. 2020లో సచిన్ పైలట్ తిరుగుబాటు చేసినప్పుడు తన ప్రభుత్వాన్ని బీజేపీ నేత వసుంధర రాజేనే కాపాడారని అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు పైలట్ ఆగ్రహాన్ని మరింత పెంచాయి. దీంతో నేరుగా గెహ్లాట్పై విమర్శలు ఎక్కుపెట్టారు. గెహ్లాట్కు నాయకురాలు సోనియా గాంధీ కాదేమోనని, వసుంధర రాజేనే కావొచ్చని ఎద్దేవా చేశారు. అందుకే, వసుంధర హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించడం లేదని ఆరోపించారు.
బీజేపీ నుంచి తన వర్గం ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకున్నారని అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపై సచిన్ పైలట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిలో కొందరు మంత్రివర్గంలోనూ ఉన్నారన్నారు. వసుంధర రాజే సాయం చేసినందుకే ఆమె ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరపడం లేదని తేటతెల్లమైందని అన్నారు.
ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా విమర్శలు చేయడం, లేఖలు రాస్తున్న సచిన్ పైలట్ మరింత స్పీడు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో పేపర్ లీకేజీలు, అవినీతికి వ్యతిరేకంగా మే 11 నుంచి ఐదు రోజుల పాటు 125 కిలోమీటర్ల ‘జన్ సంఘర్ష్ యాత్ర’ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. యాత్ర ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్తున్నా, గెహ్లాట్ ప్రభుత్వాన్నే పైలట్ లక్ష్యంగా చేసుకున్నట్టు కనిపిస్తున్నది. దేశంలో కాంగ్రెస్ అధికారం మిగిలి ఉన్న రాష్ర్టాల్లో రాజస్థాన్ ఒక్కటే పెద్దది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ను గెలిపించడంలో అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్న సచిన్ పైలట్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనే రెబెల్గా మారుతుండటంతో కాంగ్రెస్ పెద్దలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.