న్యూఢిల్లీ, అక్టోబర్ 28: పటాకులపై నిషేధం అనేది ఏ ఒక్క మతాన్ని ఉద్దేశించింది చేసింది కాదని, ప్రజలకున్న జీవించే హక్కును దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన తీర్పు అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వేడుకల పేరిట ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడాన్ని తాము అనుమతించబోమని తేల్చి చెప్పింది. పటాకులపై తాము ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా అమలు చేయాల్సిందేనని రాష్ర్టాలను, పటాకుల తయారీదారులను ఆదేశించింది. నిషేధిత పటాకులు ఇంకా బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉండటంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఎందుకు శిక్షించకూడదో చెప్పాలంటూ ఆరు పటాకుల తయారీ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ‘వేడుకలు/సంబురాల సాకుతో పటాకుల తయారీదారులు ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. మేం ఏ ఒక్క మతానికి వ్యతిరేకం కాదు. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటానికే మేం ఇక్కడ ఉన్నామని ఒక బలమైన సందేశం ఇవ్వాలనుకొంటున్నాం. అందుకే పటాకులపై నిషేధం విధించాం. దీన్ని వక్రీకరిస్తున్నారు. అన్ని పటాకులపై నిషేధం విధించలేదు. గ్రీన్ క్రాకర్స్ అమ్మడానికి అనుమతి ఉంది’ అని తెలిపింది.