న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఢిల్లీ మద్యం పాలసీ కేసు నుంచి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్దోషిగా బయటపడడం కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరిణామంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ పరిణామంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. నిజానికి కేజ్రీవాల్ అరెస్టు కాలంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది. కేజ్రీవాల్తోపాటు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ అరెస్టుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన భారీ ప్రదర్శనలో ఒకే వేదికను వీరంతా కలసి పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తన అధీనంలోని దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలపై అక్రమ కేసులను బనాయించేందుకు ఎలా దుర్వినియోగం చేస్తోందనడానికి ఈ కేసులే ప్రధాన ఉదాహరణలని కాంగ్రెస్ అప్పట్లో పేర్కొన్నది. అయితే తాజా పరిణామం మాత్రం విపక్ష రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితిని కల్పిస్తోంది.
కేజ్రీవాల్పై తొలుత అవినీతి ఆరోపణలు గుప్పించింది కాంగ్రెస్ పార్టీ కావడమే ఇందుకు కారణం. 2022 మధ్యలో అప్పటి ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ చౌదరి ఎక్సైజ్ పాలసీలో అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండు చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్కు లేఖ రాశారు. అంతేగాక రాజకీయ పొత్తుల కారణంగా కాంగ్రెస్ వైఖరిలో స్థిరత్వం లేకుండా పోయింది. లోక్సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో చేరారు. ఆ తర్వాత అరెస్టయ్యారు. ఎక్సైజ్ పాలసీలో దర్యాప్తును కాంగ్రెస్ వ్యతిరేకించనప్పటికీ దర్యాప్తు సంస్థల దుర్వినియోగాన్ని మాత్రం వ్యతిరేకించింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు చీలిపోవడంతో మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ పాత్రపై రాహుల్ గాంధీ బహిరంగంగా ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ అధికారిక నివాసం కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేయడాన్ని కూడా ఆయన విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ చిత్తుగా ఓడిపోగా కాంగ్రెస్ మళ్లీ స్వల్పంగా పుంజుకోవడం రాహుల్కు కొంత ఊరటనిచ్చింది. తాజాగా వెలువడిన కోర్టు తీర్పుతో కాంగ్రెస్ సంకట స్థితిలో చిక్కుకునే పరిస్థితి ఏర్పడింది. విపక్ష కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఇప్పుడు కేజ్రీవాల్ను తిరిగి దగ్గరకు తీసుకుంటుందా లేక తన బలాన్ని పెంచుకోవడానికి దూరం పెడుతుందా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న.