Sabarimala | దేశంలోనే ప్రఖ్యాతి చెందిన కేరళ శబరిమలై అయ్యప్ప క్షేత్రంలో వార్షిక వేడుకల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది మకర విలక్కు దర్శనాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం అవుతాయి. రెండు నెలల పాటు జరిగే మకర విలక్కు దర్శనానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కే రాధాకృష్ణ చెప్పారు. ఆధునాతన టెక్నాలజీతో భక్తులకు ఎటువంటి ఇబ్బందుల్లేకుండా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.
సన్నిధానంలో భక్తుల భారీ రద్దీని నియంత్రించడానికి డైనమిక్ క్యూ కంట్రోల్ వ్యవస్థను తీసుకొచ్చామని కే రాధాకృష్ణ తెలిపారు. నిలాక్కల్, పంబా, సన్నిధానం ప్రాంతాల్లో వీడియో స్క్రీన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పంబా-సన్నిధానం రూట్లోనే 15 ఎమర్జెన్సీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. శబరిమలలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులను వారికి తెలియజేయాలని దేవస్థానం సిబ్బందిని కోరారు.
మండల వికర విలక్కు సీజన్లో ఏటా లక్షల మంది అయ్యప్ప భక్తులు శబరిమలను దర్శిస్తారు. మలయాళ నెల వృశ్చికం మొదటి రోజు మండల మకర విలక్కు దర్శనాలు ప్రారంభం అవుతాయి. జనవరి రెండో వారంలో మకర జ్యోతి దర్శనం తర్వాత కొన్ని రోజులకు అయ్యప్ప ఆలయం మూసేస్తారు.