న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ తీరుపై సీనియర్ రాజకీయ నాయకుడు, ప్రముఖ న్యాయవాది, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం గత ఏడాది కాలంగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ రాజకీయంగా ఎదుగుతుండటంతో సీబీఐ విచారణ పేరుతో ఆయనకు నోటీసులు జారీచేసిందని విమర్శించారు. ఇలా జరుగుతుందని తాను గతంలోనే ఓ ఆర్టికల్లో పేర్కొన్నానని ఆయన గుర్తుచేశారు.
కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని, ఆయా పార్టీల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పక్కనపెట్టి ఒక్కటి కావాలని సిబల్ పిలుపునిచ్చారు. కేంద్ర అన్యాయాలపై విపక్షాలన్నీ ఒక్కటే గొంతుక అయ్యి ప్రశ్నించాలని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని ఆయన మండిపడ్డారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్షం లేని భారతదేశాన్ని కోరుకుంటున్నదని, తాను ఈ విషయాన్ని ఎప్పుడూ చెబుతుంటానని సిబల్ గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 300 ఎంపీ సీట్లు ఖాయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమాగా చెబుతున్నారని, వారికి ఎన్ని సీట్లు వస్తాయో ముందే తెలిసిపోతున్నదని, దీన్ని కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలని సిబల్ వ్యాఖ్యానించారు.
#WATCH | I had written that as Arvind Kejriwal is on a political rise, CBI will call him. The agencies are being misused for the past year. All political parties should keep their differences aside and speak in one voice against this injustice…This is the murder of democracy:… pic.twitter.com/JosohKpNfv
— ANI (@ANI) April 15, 2023