న్యూఢిల్లీ: సుదూర అంతరిక్షం నుంచి అమెరికన్ స్పేస్ ఏజెన్సీకి లేజర్ సిగ్నల్(Laser Message) అందింది. సుమారు 140 మిలియన్ల మైళ్ల దూరం నుంచి ఆ సిగ్నల్ వచ్చింది. రోదసిలోకి నాసా పంపిన సైకీ 16 వ్యోమనౌక నుంచి ఆ లేజర్ సంకేతం అందినట్లు తేలింది. గత ఏడాది అక్టోబర్ లో సైకీ 16 స్పేస్క్రాఫ్ట్ను నాసా ప్రయోగించింది. ఆస్టరాయిడ్ లక్ష్యంగా దాన్ని ప్రయోగించారు. దీనిలో భాగంగానే ఆ స్పేస్క్రాఫ్ట్కు సైకీ పేరు పెట్టారు. మార్స్ , జ్యూపిటర్ గ్రహాల మధ్య ఆ గ్రహశకలం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సైకీ స్పేస్క్రాఫ్ట్లో డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్ సిస్టమ్ ఉన్నది. దీని ద్వారా లేజర్ కమ్యూనికేషన్స్ చేపడుతారు. ప్రస్తుతం ఉన్న రేడియో తరంగాల కన్నా.. ఈ లేజర్ కమ్యూనికేషన్ వేగవంతంగా వెళ్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైకీ స్పేస్క్రాఫ్ట్లో ఉన్న లేజర్ కమ్యూనికేషన్స్ సుమారు 140 మిలియన్ల మైళ్ల దూరం నుంచి డేటాను ట్రాన్స్మిట్ చేసింది. భూమికి, సూర్యుడి మధ్య ఉన్న దూరానికి ఇది 1.5 రెట్లు ఎక్కువ.
ఈ లేజర్ డేటా గురించి ప్రాజెక్టు ఆపరేషన్స్ అధిపతి మీరా శ్రీనివాసన్ మాట్లాడారు. ఏప్రిల్ 8వ తేదీన 10 నిమిషాల లేజర్ డేటాను డౌన్లింక్ చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సంప్రదాయ పద్దతుల కన్నా లేజర్ కమ్యూనికేషన్స్ ఉత్తమంగా పనిచేస్తుందా లేదా అన్న కోణంలో స్టడీ చేపట్టినట్లు చెప్పారు. ఏప్రిల్ 8వ తేదీన సైకీ స్పేస్క్రాఫ్ట్ 25 ఎంబీపీఎస్ వేగంతో డేటాను ట్రాన్స్మిట్ చేసినట్లు తేలింది.