న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: కొలీజియం సిఫారసులపై తీవ్ర జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు హెచ్చరించడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసిన ఐదుగురి నియామకాలకు ఎట్టకేలకు శనివారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్లో వెల్లడించారు. కొలీజియం సిఫారసులపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరు మీద సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఒకరోజు తర్వాతనే తాజా నియామకాలకు ఆమోదముద్ర వేయడం గమనార్హం. కొత్తగా నియమితులైన వారిలో తెలుగు వ్యక్తి జస్టిస్ పీవీ సంజయ్కుమార్ కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నారు. రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంకజ్ మిత్తల్, పాట్నా హైకోర్టు సీజే జస్టిస్ సంజయ్ కరోల్, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ మిశ్రాకు కూడా సుప్రీం జడ్జీలుగా పదోన్నతి లభించింది.
రెండు నెలలకు ఆమోదం..
ఈ ఐదుగురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం గత ఏడాది డిసెంబర్ 13న సిఫారసు చేయగా.. కేంద్రం దాదాపు రెండు నెలలకు ఆమోదం తెలిపింది. వీరి నియామకంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరింది. కొత్తగా నియమితులైన న్యాయమూర్తులు సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. జనవరి 31న మరో ఇద్దరు న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని కొలీజియం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. వీరి నియామకంపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
కఠిన నిర్ణయం తీసుకునేలా చేయొద్దు
కొలీజియం సిఫారసులకు ఆమోదం తెలుపడంలో జాప్యంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిఫారసులను సుదీర్ఘకాలంగా పెండింగ్లో పెట్టడంపై జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇది చాలా సీరియస్ అంశమని, కాలయాపన చేయటం సరికాదని పేర్కొన్నది. ఈ విషయంలో కఠిన నిర్ణయం తీసుకునేలా చేయవద్దని హెచ్చరించింది. సుప్రీంకోర్టు హెచ్చరికలపై కేంద్ర మంత్రి రిజిజు ఉత్తరప్రదేశ్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వం రాజ్యాంగం, ప్రజల అభీష్టానికి అనుగుణంగా పనిచేస్తుందని, ఎవరూ ఎవరికి హెచ్చరికలు ఇవ్వలేరని అన్నారు. ఈ దేశానికి ప్రజలే సుప్రీం అని, మనమంతా సేవకులమని వ్యాఖ్యానించారు.
కొత్త న్యాయమూర్తులు వీరే..
జస్టిస్ పీవీ సంజయ్కుమార్
1963, ఆగస్టు 14న జన్మించారు. తల్లిదండ్రులు పద్మావతమ్మ, రామచంద్రారెడ్డి. వీరిది కడప జిల్లా, అయితే సంజయ్కుమార్ పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. నిజాం కాలేజీలో కామర్స్లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 1988లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. పి రామచంద్రారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అడ్వకేట్ జనరల్గా 1969-82 మధ్య పనిచేశారు. సంజయ్కుమార్ 1988లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొన్నారు. 2000-03 మధ్య ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2008 ఆగస్టులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు జడ్జిగా పదోన్నతి పొందిన ఆయన.. 2010, జనవరి 20న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2019లో పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయిన జస్టిస్ సంజయ్కుమార్, 2021, ఫిబ్రవరిలో మణిపూర్ హైకోర్టు సీజే అయ్యారు.
జస్టిస్ పంకజ్ మిత్తల్
1982లో అలహాబాద్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పొందిన జస్టిస్ పంకజ్ మిత్తల్.. మీరట్లో ఎల్ఎల్బీ చేశారు. 1985 నుంచి అలహాబాద్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2021, జనవరిలో జమ్ముకశ్మీర్ సీజేగా పదోన్నతి పొందారు.
జస్టిస్ సంజయ్ కరోల్
పాట్నా హైకోర్టు సీజేగా 2019, నవంబర్లో నియమితులయ్యారు. అంతకుముందు త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. త్రిపుర స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ పాట్రాన్-ఇన్-చీఫ్గా, త్రిపుర జ్యుడీషియల్ అకాడమీ చైర్మన్గా విధులు నిర్వర్తించారు.
జస్టిస్ ఎహసానుద్దీన్ అమానుల్లా
పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా 2011లో నియామకం పొందారు. ఆ తర్వాత 2021లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు.. మళ్లీ 2022, జూన్లో పాట్నా హైకోర్టు బదిలీ అయ్యారు. 1963, మే 11న జన్మించిన జస్టిస్ అమనుల్లా.. 1991లో బీహార్ స్టేట్ బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకొన్నారు.
జస్టిస్ మనోజ్ మిశ్రా
అలహాబాద్ యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. 2011లో అలహాబాద్ హైకోర్టు అదనపు జడ్జీగా పదోన్నతి పొందారు. 2013లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు.