ముంబై: పలు సైబర్ మోసాల కోసం సైబర్ నేరగాళ్లు తన బ్యాంకు ఖాతాను వినియోగించినట్లు తెలుసుకుని ఒక మహిళ షాక్ అయ్యింది. సైబర్ సెల్ పోలీసులు నోటీస్ జారీ చేయడంతో ఆమె ఆందోళన చెందింది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. (Woman suicide) మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. డొంబివ్లీలోని ఒక ప్రాంతంలో 38 ఏళ్ల దేవిక ఆర్ముగం పండారమ్ నివసిస్తున్నది. ఆగస్ట్ 8న రాజస్థాన్లోని చురు సైబర్ సెల్ పోలీస్ స్టేషన్కు చెందిన పోలీస్ అధికారులు ఆమె ఇంటికి చేరుకున్నారు. ఆన్లైన్ మోసాల కోసం ఆమెకు చెందిన ‘బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర’ ఖాతాను వినియోగించినట్లు ఆరోపించారు. దీనిపై నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని ఆమెకు నోటీస్ జారీ చేశారు.
కాగా, ఇది తెలుసుకుని దేవిక షాక్ అయ్యింది. మరింత స్పష్టత కోసం థానే పోలీస్ కమిషనరేట్లోని సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆమె సంప్రదించింది. అయితే రాజస్థాన్తో పాటు గుజరాత్, హర్యానా, బీహార్, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు వంటి అనేక రాష్ట్రాల్లో కూడా ఆమె బ్యాంకు ఖాతా వినియోగంపై పలు సైబర్ మోసం కేసులు నమోదయ్యాయని కమిషనరేట్ అధికారులు తెలిపారు.
మరోవైపు ఈ విషయం తెలిసి దేవిక మరింత ఆందోళన చెందింది. పోలీస్ విచారణ కోసం పలు రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఆగస్ట్ 26న సాయంత్రం 4 గంటల సమయంలో బ్లేడ్తో తన మణికట్టు, గొంతు కోసుకున్నది. గమనించిన బంధువులు తొలుత ప్రైవేట్ ఆసుపత్రికి ఆమెను తరలించారు. శాస్త్రి నగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయడంతో అక్కడకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే దేవిక మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.