ముంబై : ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్కు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై మే 14న అరెస్టయిన మరాఠీ నటి కేతకి చితాలే బెయిల్ పిటిషన్ను థానే మేజిస్ట్రేట్ కోర్టు తోసిపుచ్చింది. ఆమె పాల్పడిన నేరం తీవ్ర స్వభావంతో కూడినది కావడంతో బెయిల్ నిరాకరించినట్టు మేజిస్ట్రేట్ కోర్టు స్పష్టం చేసింది.
థానే సెషన్స్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేయాలని నటి న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ కేసులో చితాలే జ్యుడిషియల్ కస్టడీని మేజిస్ట్రేట్ కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. తన ఫేస్బుక్ పేజీలో చితాలే(29) పోస్టును షేర్ చేయడంతో శనివారం ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. నటి షేర్ చేసిన పోస్ట్లో పవార్ను ఉద్దేశించి మీ కోసం నరకం వేచిచూస్తోందని, మీరు బ్రాహ్మణులను ద్వేషిస్తారనే అభ్యంతరకర పదాలున్నాయి.
ఇక చితాలేపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన మరో కేసులో ఆమె బెయిల్ కోసం న్యాయస్ధానాన్ని ఆశ్రయించగా దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ప్రాసిక్యూషన్ కోరింది. పవార్పై రాసిన పద్యాన్ని చితాలే అప్లోడ్ చేయడంతో ఆమెకు వ్యతిరేకంగా పలు ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి.