న్యూఢిల్లీ: నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)కు చెందిన పాఠ్య పుస్తకాల్లో పలు మార్పులు చేశారు. 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో జాతిపిత మహాత్మా గాంధీజీకి సంబంధించిన కొన్ని అంశాలతోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై నిషేధానికి సంబంధించిన అంశాలను తొలగించారు. ‘గాంధీజీ మరణం దేశంలోని మతపరమైన పరిస్థితులపై మ్యాజికల్ ప్రభావం చూపింది’, ‘హిందూ-ముస్లిం ఐక్యత కోసం గాంధీజీ చేసిన ప్రయత్నాలు హిందూ తీవ్రవాదులను రెచ్చగొట్టింది’ ‘ఆర్ఎస్ఎస్ వంటి సంస్థలను కొంతకాలం పాటు నిషేధించారు’ వంటి వాఖ్యాలు కొత్తగా ముద్రించిన పాఠ్యపుస్తకాల్లో లేవు. అలాగే గుజరాత్ అల్లర్లు, మొఘల్స్ పాలన, ఎమర్జెన్సీ, కోల్డ్వార్, నక్సలైట్ ఉద్యమం, కోర్టులకు సంబంధించిన పాఠ్యాంశాల్లోని కొన్ని భాగాలను కూడా తొలగించారు.
కాగా, ఎన్సీఈఆర్టీ 12వ తరగతి సోషల్ పాఠ్యపుస్తకంలో చేసిన ఈ మార్పులపై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎన్సీఈఆర్టీ దీనిపై స్పందించింది. కరోనా దృష్ట్యా, విద్యార్థులపై సిలబస్ లోడ్ తగ్గించడం తప్పనిసరి అని భావించినట్లు వెబ్సైట్లో పేర్కొంది. అలాగే జాతీయ విద్యా విధానం (NEP) 2020 ప్రకారం అన్ని తరగతులు, అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలను క్రమబద్ధీకరించేందుకు కసరత్తు చేసినట్లు తెలిపింది. 2022-23 పాఠ్యపుస్తకాల్లో చేసిన ఈ మార్పులు 2023-24 విద్యా సంవత్సరంలో కొనసాగుతాయని పేర్కొంది.
మరోవైపు ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేష్ సక్లానీ కూడా ఇదే విషయం తెలిపారు. ఈ ఏడాది సిలబస్ను ఏ మాత్రం కుదించలేదని చెప్పారు. గత సంవత్సరం జూన్లో సిలబస్ హేతుబద్ధీకరణ జరిగిందని, ఈ సందర్భంగా ఎక్కువ ప్రాముఖ్యత లేని, సంబంధం లేని, వివాదస్పద అంశాలు వంటి వాటిని సిలబస్ నుంచి తొలగించినట్లు వెల్లడించారు.
Also Read: