Terrorists | న్యూఢిల్లీ : అంతర్జాతీయ సరిహద్దులో జమ్మూలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. భారీ ఆయుధాలు కలిగిన నలుగురు ఉగ్రవాదులు.. అక్నూర్లోని కోహూర్ సెక్టార్ వద్ద భారత్లోకి చొరబడేందుకు యత్నించారు. ఉగ్రవాదులను కదలికలను పసిగట్టిన సైన్యం వారి చొరబాటును అడ్డుకునేందుకు యత్నించింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు సంభవించాయి. నలుగురిలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
అయితే అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాలు సైన్యానికి పక్కా సమాచారం అందించాయి. దీంతో డిసెంబర్ 22వ తేదీ రాత్రి కోహూర్ సెక్టార్లో నిఘా ఉంచి, ఉగ్రవాదులను అడ్డుకున్నారు. అయితే సైన్యం కాల్పుల్లో హతమైన ఉగ్రవాది డెడ్బాడీని మిగతా ఉగ్రవాదులు వెనక్కి ఈడ్చుకెళ్లినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.