న్యూఢిల్లీ, ఆగస్టు 24: సరిహద్దులో ఉగ్ర కుట్రలను భారత సైన్యం భగ్నం చేసింది. ఇండియన్ పోస్టుపై దాడికి ప్లాన్ చేసిన పాకిస్థాన్ ఉగ్రవాది తబరక్ హుస్సేన్ను ప్రాణాలతో పట్టుకున్నది. ఈ ఘటన రాజౌరీ జిల్లా నౌషెరా రీజియన్లోని ఝంగర్ సెక్టార్ పరిధిలో ఈనెల 21న చోటుచేసుకున్నదని భారత ఆర్మీ బుధవారం ప్రకటించింది. అదేవిధంగా లామ్ సెక్టార్లో 22న రాత్రి జరిగిన మరో ఘటనలో మరో ఇద్దరు చొరబాటుదారులు ల్యాండ్మైన్ పేలుడులో మరణించినట్టు వెల్లడించింది. ఉగ్రవాదులు మైన్ఫీల్డ్లోకి ప్రవేశించడంతో.. ల్యాండ్మైన్లు యాక్టివేట్ అయి పేలుడు జరిగిందని తెలిపింది.
మృతదేహాలను తరువాతి రోజున గుర్తించినట్టు తెలిపింది. ఝంగర్ సెక్టార్ పరిధిలోని సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి అనుమానస్పదంగా తిరుగుతున్న ముగ్గురు ఉగ్రవాదులను జవాన్లు గుర్తించారు. వారిలో ఒక చొరబాటుదారుడు ఇండియన్ పోస్టు సమీపానికి రావడంతో పాటు ఫెన్సింగ్ను కట్ చేసేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో జవా న్లు జరిపిన కాల్పుల్లో గాయపడిన అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
మరో ఇద్దరు పరారై.. పాక్ భూభాగంలోని అడవిలోకి వెళ్లి దాక్కున్నారు. తబరక్ హుస్సేనే గతంలో కూడా సరిహద్దు నియంత్రణ రేఖను దాటినందుకు అరెస్టు అయ్యాడు. తాజాగా ఇండియన్ పోస్టుపై దాడి చేసేందుకు హుస్సేన్కు యూనస్ అనే పాక్ కల్నల్ ఒకరు 30 వేల పాకిస్థానీ రూపాయలు ఇచ్చారని, ఈ విషయాన్ని హుస్సే న్ విచారణలో ఒప్పుకున్నాడని అధికారులు తెలిపారు. అతని వద్ద నుంచి ఆ డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఆర్మీ తెలిపింది.