Terror attack : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో ఉగ్రవాదులు (Terrorists) రెచ్చిపోయారు. పహల్గామ్ (Pahalgam) లోని బైసరన్ లోయలో కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పర్యాటకులు మరణించారు. మరో ఆరుగురు పర్యాటకులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు, వైద్య బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. బైసరన్ లోయలో ట్రెక్కింగ్ ట్రిప్ కోసం వెళ్లిన పర్యాటకులపై ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం గుర్తుతెలియని ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో గాయపడిన వారిలో ముగ్గురు స్థానికులు కాగా, మరో ముగ్గురు ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. ఘటన నేపథ్యంలో పహల్గామ్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.