Manipur | ఇంఫాల్, మే 23: తాజా అల్లర్ల నేపథ్యంలో భయం గుప్పిట చిక్కుకున్న మణిపూర్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలో వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని భద్రతా దళాలు సూచించాయి. రాష్ట్రమంతటా ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. కొద్ది గంటల సడలింపుతో కర్యూ కొనసాగిస్తున్నారు. శాంతి భద్రతల కోసం 10 వేల మంది సైనికులను రాష్ట్రమంతటా మోహరించినట్టు సర్కారు తెలిపింది. సోమవారం జరిగిన హింసకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేతో పాటు ఇద్దరిని అరెస్టు చేసినట్టు సీఎం బిరేన్ సింగ్ వెల్లడించారు. లైనెన్స్ కలిగిన తుపాకులతో కొందరు స్థానికులు వారి ప్రాంతాల్లో కాపలా కాశారు. మరోవైపు మణిపూర్ పరిస్థితిపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ స్పందించారు. మత రాజకీయాలు ప్రజలను రాజకీయంగా ప్రభావితం చేస్తాయని ట్వీట్ చేశారు. మత రాజకీయాలనే వైరస్ వ్యాప్తి చెందితే జరిగే పరిణామాలను ఊహించలేమన్నారు. దాని వల్ల కలిగే ఫలితాలు తాత్కాలికమని, కానీ అవి శాశ్వతంగా భయపెడతాయని ఆయన అన్నారు.
మైతీ తెగ దాడులతో కుకీ ప్రజల్లో ఆందోళన!
మైతీ తెగ దుండగులు చర్చిలపైనా దాడులు చేస్తున్నారని కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్కు చెందిన ఖంగ్సాయ్ ఆరోపించారు. ఆయన ‘ది వైర్’తో మాట్లాడుతూ రాష్ట్రంలో హింస కారణంగా ఇప్పటివరకు సుమారు 7 వేల మంది ప్రజలు మిజోరంలో ఆశ్రయం పొందుతున్నారన్నారు. వీరిలో ఎక్కువ శాతం కుకీ తెగ ప్రజలేనన్నారు. తాజా అల్లర్లలో ప్రస్తుత రాజ్యసభ ఎంపీ లేశంబా సునాజాఓబా ప్రమేయం ఉన్నదని ఖంగ్సాయ్ ఆరోపించారు. అరంబై తెంగ్గోల్ అనే మైతీ వలంటీర్ గ్రూప్ గ్రామాల్లో 20పైకి ఇండ్లకు నిప్పు పెట్టిందని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ గ్రూప్ సభ్యుల నియామకాన్ని ఎంపీ లేశంబానే చేపట్టారని వెల్లడించారు. మిజోరం జనాభాలో 53 శాతంగా ఉన్న మైతీ ప్రజలు తమకు షెడ్యూల్ తెగ హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పర్వత ప్రాంతాల్లోని నాగా, కుకీ తెగల ప్రజలు ఈ డిమాండ్ను వ్యతిరేకిస్తున్నారు.