శివమొగ్గ, ఆగస్టు 15: కర్ణాటకలోని శివమొగ్గలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని అమీర్ అహ్మద్ సర్కిల్లో సావర్కర్, టిప్పు సుల్తాన్ ఫ్లెక్సీల ఏర్పాటు వివాదానికి దారితీసింది. ఫ్లెక్సీల విషయంలో రెండు గ్రూపుల మధ్య గొడవతో ఉద్రిక్తతలు రేగాయి. దీంతో పోలీసులు నగరంలో కర్ఫ్యూ విధించారు. ఓ గ్రూపు సావర్కర్ ఫ్లెక్సీ కట్టేందుకు ప్రయత్నించిందని, అక్కడ టిప్పు సుల్తాన్ ఫ్లెక్సీ పెట్టుకోవాలంటూ మరో గ్రూపు అభ్యంతరం వ్యక్తం చేసిందని, ఇది రెండు గ్రూపుల మధ్య వాగ్వివాదం జరిగిందని, అనంతరం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిందని పోలీసులు పేర్కొన్నారు.
ఫ్లెక్సీలు కట్టాలనుకున్న ప్రాంతంలో పోలీసులు జాతీయ జెండా ఏర్పాటు చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు నగరంలోని గాంధీ బజార్లో ప్రేమ్సింగ్ అనే వ్యక్తిపై కత్తితో దాడి జరిగింది. రాష్ట్ర హోంమంత్రి జ్ఞానేంద్ర మాట్లాడుతూ ఈ ఘటన సావర్కర్ ఫొటో అంశం కారణంగానే జరిగినట్టు అనిపిస్తుందని చెబుతూనే.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు.