పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీలో జోష్ నెలకొంది. టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ గోవాలో బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సమక్షంలో శుక్రవారం ఆ పార్టీలో చేరారు. లియాండర్ పేస్ చేరికను దీదీ స్వాగతిస్తూ పేస్ తనకు సోదరుడి వంటి వాడని వ్యాఖ్యానించారు. తాను యువజన సర్వీసుల మంత్రిగా ఉన్నప్పటి నుంచి పేస్తో పరిచయం ఉందని, అప్పుడతను చాలా చిన్నవాడని పేస్ టీఎంసీలోకి రావడం తనకు సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.
అంతకుముందు నటి, సామాజిక కార్యకర్త నఫిసా అలి కూడా టీఎంసీలో చేరారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్ధానాల్లో పోటీ చేసేందుకు టీఎంసీ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మూడు రోజుల పాటు గోవాలో గడపనున్నారు. తనను హిందూ వ్యతిరేకిగా కాషాయ పార్టీ చిత్రీకరిస్తోందని టీఎంసీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆమె పేర్కొన్నారు. టీఎంసీ అంటే టెంపుల్, మసీదు, చర్చ్ల కోసం నిలబడే పార్టీ అని తమకు అన్ని మతాలూ ఒకటేనని ఆమె స్పష్టం చేశారు.