పట్నా : బిహార్లో దేవాలయాలు ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేయించుకుని ఆపై పన్నులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కలకలం రేపింది. బిహార్ రాష్ట్ర ధార్మిక ట్రస్ట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయంపై ధార్మిక సంస్ధలు, భక్తులు భగ్గుమంటున్నారు.
వ్యక్తులు తమ ఇంటి ప్రాంగణాల్లో దేవాలయాలు నిర్మించి భక్తులను అనుమతించినా ఈ ఉత్తర్వుల పరిధిలోకి వస్తాయని ఆయా ఆలయాలు నాలుగు శాతం పన్ను చెల్లించాలని ధార్మిక ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. ఆయా ఆలయాలు వ్యక్తుల ఇంటి ప్రహరీ గోడకు వెలుపల ఉంటే వాటిని పబ్లిక్గా పరిగణించి పన్ను విధిస్తామని పేర్కొంది. భక్తులు దర్శించే ప్రతి ఆలయాన్ని నమోదు చేయించాలని ఆపై వాటికి వచ్చే ఆదాయంలో నాలుగు శాతం పన్ను చెల్లించాలని స్పష్టం చేసింది.
నితీష్ కుమార్ సర్కార్ నిర్ణయాన్ని కాంగ్రెస్, ఏఐఎంఐఎంలు తప్పుపట్టాయి. ఆలయాలపై పన్ను విధింపు నిర్ణయాన్ని జిజియా పన్నుగా శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు కామేశ్వర్ చౌపాల్ అభివర్ణించారు. ఆలయాలపై తాము పన్ను విధించలేదని..అది కేవలం వార్షిక సేవా రుసుమని బిహార్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.