ముంబై : మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరుసగా మూడు రోజుల పాటు కురిసిన వర్షాలతో రత్నగిరి పట్టణం జలమయమైంది. లామ్జా తాలూకలోని దత్త ఆలయాన్ని వరద నీరు ముంచెత్తింది. కుండపోతతో సగం ఆలయం నీట మునిగింది. భారీ వర్షం ఇలాగే కొనసాగితే ఆలయ శిఖరానికి నీరు చేరుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
దత్త ఆలయాన్ని సందర్శించేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. మరోవైపు ముంబై నగరంలోనూ భారీ వర్షాలతో వీధులు జలమయమయ్యాయి. వరద పరిస్ధితిని సమీక్షించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపట్టాలని మహారాష్ట్ర నూతన సీఎం ఏక్నాథ్ షిండే అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని థానే, పాల్ఘర్, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్, కొల్హాపూర్ జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.