న్యూఢిల్లీ: గుడికి చెందిన మాన్యం భూములకు దేవుడే యజమాని అని, పూజారిని ‘భూమిస్వామి’గా పేర్కొనడం తగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పూజారి లేదా అర్చకుడు కేవలం ఆస్తుల నిర్వహణకు మాత్రమే పరిమితమని న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం సోమవారం తేల్చి చెప్పింది. ఆలయ భూముల రికార్డుల్లో నుంచి పూజారుల పేర్లు తొలగిస్తూ జారీ చేసిన రెండు సర్కులర్లను హైకోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఈ కీలకమైన తీర్పును వెలువరించింది. భూమి పత్రాల్లో యజమాని అని ప్రస్తావించిన చోట దేవుడి పేరునే న్యాయమైన హక్కుదారుగా రాయాలని సుప్రీంకోర్టు తెలిపింది. భూమిని ఆధీనంలో కలిగి ఉన్న వ్యక్తిగా కూడా దేవుడి పేరునే సూచించాలని చెప్పింది. సేవకుడు లేదా మేనేజర్ల పేర్లు చేర్చాల్సిన అవసరం లేదని నొక్కిచెప్పింది. పూజారిగా నియమితుడైన వ్యక్తి కౌలుదారు, ప్రభుత్వ లీజుదారు లేదా పన్ను మినహాయింపు భూముల సాధారణ కౌలుదారు కాదని, కేవలం ఆలయ భూముల నిర్వాహకుడు మాత్రమేనని చట్టం స్పష్టంగా చెప్తున్నదని ధర్మాసనం పేర్కొన్నది. పూజారి కేవలం దేవుని ఆస్తుల నిర్వహణకు మాత్రమే నియామకం కలిగి ఉంటారని తెలిపింది. ధూపదీప నైవేద్యాల సమర్పణ, భూముల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన పూజారి ఆ విధుల్లో విఫలమైతే ఆ నియామకాన్ని రద్దు చేయవచ్చని ధర్మాసనం సూచించింది.
‘పెగాసస్’పై కేంద్రానికి మరికొంత గడువు
పెగాసస్ వ్యవహారంలో బదులివ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మరికొంత గడువు ఇచ్చింది. కొన్ని కారణాల వల్ల రెండో అఫిడవిట్ దాఖలుచేసే అంశంపై సంప్రదించేందుకు సంబంధిత అధికారులను కలవలేకపోయానని, కొంత గడువు కావాలని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు. దీంతో విచారణను ఈ నెల 13కు వాయిదా వేస్తున్నట్టు సీజేఐ ప్రకటించారు.