న్యూఢిల్లీ: వరి విస్తీర్ణం పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొన్నది. ఈ నెల 18 వరకు సేకరించిన గణాంకాల ప్రకారం.. ప్రస్తుత వానకాలం సీజన్లో తెలంగాణలో వరి పంట సాగు గత రెండేండ్ల కంటే పెరిగింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే రైతులు ఈసారి 4.42 లక్షల హెక్టార్లలో అధికంగా వరి సాగు చేశారు. నూనె గింజల సాగు కూడా 0.23 లక్షల హెక్టార్ల మేర పెరిగినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. రెండు పంటల సాగు విస్తీర్ణం కూడా 4.65 లక్షల హెక్టార్ల మేర పెరిగింది. దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణం 15 లక్షల హెక్టార్ల మేర పెరుగ్గా, అందులో 30% వాటా తెలంగాణదే కావడం గమనార్హం. ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. తర్వాతి స్థానాల్లో బీహార్, చత్తీస్గఢ్, జార్ఖండ్ ఉన్నాయి.