తమ పార్టీ నిర్వహించిన ఇఫ్తార్ విందుకు సీఎం నితీశ్ హాజరు కావడంపై ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్ స్పందించారు. తమ పార్టీ ఇఫ్తార్ విందును, మకర సంక్రాంతిని కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తోందని గుర్తు చేశారు. దగ్గరి వారితో పాటు అన్ని పార్టీలకు సంబంధించిన అగ్రనేతలను పిలుస్తుంటామని అన్నారు. సంప్రదాయంగా వస్తున్న కార్యక్రమమని, ఇలా చేయడం ద్వారా శాంతి, సద్భావన నెలకొనాలన్నదే తమ అభిమతమని ఆయన వివరించారు.
ఇలాంటి పవిత్ర కార్యక్రమాలకు రాజకీయాలను ఆపాదించడం ఎంతో పెద్ద తప్పని తేజస్వీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మళ్లీ నితీశ్తో కలుస్తారా? అని ప్రశ్నించగా… కేవలం ఇఫ్తార్ విందులతో ప్రభుత్వాలు ఏర్పడిపోతాయా? అంటూ తేజస్వీ సూటిగా ప్రశ్నించారు.
తమ పార్టీ ఎప్పుడూ ఆరెస్సెస్, బీజేపీ మిత్రపక్షాలతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ.. అవగాహన కుదుర్చుకోదని స్పష్టం చేశారు. అయితే జేడీయూ ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షంగా ఉందని, అయితే.. బీజేపీతో ఆ పార్టీ కలిసి ఎన్నో సంవత్సరాలు గడవలేదని గుర్తు చేశారు. స్వప్రయోజనాలు, అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కలిగే లాభాల కోసం తాము వెంపర్లాడమని తేజస్వీ తేల్చి చెప్పారు.