పట్నా : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బిహార్ విపక్ష నేత తేజస్వి యాదవ్ తోసిపుచ్చారు. మార్చి 10న అఖిలేష్ యాదవ్ విజయోత్సవ లడ్డూను రుచి చూడబోతున్నారని వ్యాఖ్యానించారు. యూపీలో యోగి ఆదిత్యానాధ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం విస్పష్ట మెజారిటీతో అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఎద్దేవా చేశారు.
ఎగ్జిట్ పోల్స్ తర్వాత బీజేపీ లడ్డూలతో సెలెబ్రేట్ చేసుకుంటే మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత సమాజ్వాదీ పార్టీ అసలైన విజయోత్సవ లడ్డూలను ఆరగిస్తుందని అన్నారు. ఇక యూపీలో బీజేపీ సర్కార్ అత్యధిక మెజారిటీతో కొలువు తీరుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడవడంతో బిహార్ బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.
ప్రజల కోసం పనిచేసిన వారు తిరిగి ఎన్నికవుతారని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ డాక్టర్ సంజయ్ జైస్వాల్ పేర్కొన్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ మోడల్ను యోగి ఆదిత్యానాధ్ అమలు చేసి పేదల సంక్షేమానికి పాటుపడ్డారని అన్నారు. ఇక యూపీలో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని, పంజాబ్లో ఆప్ క్లీన్స్వీప్ చేస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.