పాట్నా: బీహార్కు చెందిన ఆర్జేడీ సోదరులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజశ్వి యాదవ్ మధ్య వివాదం మరింతగా ముదురుతున్నది. త్వరలో జరుగనున్న ఉప ఎన్నికల్లో కుశేశ్వర్ ఆస్థాన్ నియోవర్గం కాంగ్రెస్ అభ్యర్థి అతిరిక్ కుమార్ తరుఫున ప్రచారం చేస్తానని తేజ్ ప్రతాప్ యాదవ్ తెలిపారు. తాను కొత్తగా ఏర్పాటు చేసిన విద్యార్థి జనశక్తి పరిషత్ కుశేశ్వర్ ఆస్థాన్లో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తుందని ఆయన చెప్పారు. అయితే తారాపూర్ అసెంబ్లీ స్థానంలో ఆర్జేడీ అభ్యర్థి తరుఫున ప్రచారం చేయనున్నట్లు వెల్లడించారు.
‘ఉప ఎన్నికలు జరిగే కుశేశ్వర్ ఆస్థాన్, తారాపూర్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసిన తరువాత, కుశేశ్వర్ ఆస్థాన్ కాంగ్రెస్ అభ్యర్థి అతిరిక్ కుమార్, తారాపూర్ ఆర్జేడీ అభ్యర్థి అరుణ్ కుమార్కి మద్దతును అందించాలని ఛత్ర జనశక్తి పరిషత్ నిర్ణయించింది. ఈ సంఘానికి చెందిన విద్యార్థులు తమ తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా అభ్యర్థుల కోసం గట్టిగా ప్రచారం చేసి వారి గెలుపునకు కృషి చేయాలి’ అని తేజ్ ప్రతాప్ శనివారం పిలుపునిచ్చారు.
బీహార్లో ఈ నెల 30న రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. మహాకూటమికి చెందిన ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా తమ అభ్యర్థులను పోటీకి నిలిపాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి అతిరిక్ కుమార్ తండ్రి, బీహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ కుమార్ ఇటీవల తేజ్ ప్రతాప్ యాదవ్ను కలిశారు. కుశేశ్వర్ ఆస్థాన్లో తన కుమారుడి గెలుపు కోసం ఆయన మద్దతు కోరారు. దీంతో తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ మేరకు శనివారం ప్రకటించారు.
అయితే ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ కుమారులైన తేజ్ ప్రతాప్ యాదవ్, తేజశ్వి యాదవ్ మధ్య ఇది మరింత దూరం పెంచనున్నట్లు తెలుస్తున్నది. ఆర్జేడీకి వ్యతిరేకంగా తేజ్ ప్రతాప్ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆయనపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. తన అనుచరుడ్ని విద్యార్థి విభాగం అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పటి నుంచి తేజశ్వికి వ్యతిరేకంగా ఆయన అన్న తేజ్ ప్రతాప్ వ్యవహరిస్తున్నారు. తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ను తనతో కలవనీయకుండా ఢిల్లీలో నిర్బంధించినట్లు ఇటీవల ఆయన ఆరోపించారు.