న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఎర్రకోటకు సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 16ఏండ్ల బాలుడిపై 40ఏండ్ల వ్యక్తి గత కొంతకాలంగా బలాత్కారానికి పాల్పడుతుండటంతో, దాన్ని సహించలేని ఆ బాలుడు ఎదురుదాడికి దిగాడు. ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో బాధితుడి చేతిలో నిందితుడు శంభు ప్రాణాలు కోల్పోయాడని ఢిల్లీ పోలీసులు మంగళవారం వెల్లడించారు. ఏప్రిల్ 14న చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
రెండో తరగతి వరకే చదువుకున్న బాలుడు తొలుత ముంబై వెళ్లి సినీ పరిశ్రమలో పనిచేయాలనుకున్నాడు. పాత ఢిల్లీ రైల్వే స్టేషన్లో అనుకోకుండా శంభు పరిచయమయ్యాడు. శంభు తనపై రెండు నెలలుగా బలవంతంగా లైంగికదాడికి పాల్పడుతున్నాడని బాలుడు పోలీసులకు చెప్పాడు. శంభు స్నేహితుడు షాజిద్ఖాన్ ప్రత్యక్ష సాక్షిగా ఇచ్చిన వివరాల్ని పోలీసులు పరిగణనలోకి తీసుకొని బాధితుడైన బాలుడిపై హత్య కేసును నమోదుచేశారు. బాలుడు బీహార్లోని సిఖ్పురాకు చెందినవాడని తెలిసింది. బాలుడిని పోలీసులు జువెనైల్ హోంకు తరలించారు.