ముంబై: ప్రేమ సంబంధాన్ని వ్యతిరేకించిన తల్లిని ప్రియుడి సహాయంతో కుమార్తె హత్య చేసింది. అనంతరం అతడితో కలిసి పారిపోయింది. చివరకు పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 37 ఏళ్ల సబా హష్మీ అనే మహిళ ముగ్గురు కూతుళ్లతో కలిసి ముంబ్రాలోని అమృత్ నగర్ ప్రాంతంలో నివసిస్తున్నది. ఆమె భర్త డ్రగ్స్ కేసులో అరెస్టై జైళ్లో ఉన్నాడు. దీంతో హష్మీ ట్యూషన్లు చెబుతూ కుటుంబాన్ని పోషిస్తున్నది. బంధువులు కూడా ఆమెకు అండగా నిలిచారు.
కాగా, 17 ఏళ్ల కుమార్తెకు, పొరుగున ఉంటే 22 ఏళ్ల వ్యక్తితో స్నేహం ఏర్పడింది. అయితే వారిద్దరి మధ్య సంబంధాన్ని హష్మీ వ్యతిరేకించింది. ఆ వ్యక్తి పలుసార్లు రాత్రివేళ వారి ఇంట్లో నిద్రించాడు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం ఈ విషయంపై కుమార్తె, ఆమె ప్రియుడు, హష్మీ మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన కుమార్తె తన ప్రియుడితో కలిసి తల్లిని కత్తితో పొడిచి హత్య చేసింది. అనంతరం డోర్ లాక్ చేసి అతడితో కలిసి అక్కడి నుంచి పారిపోయింది.
మరోవైపు హష్మీ, ఆమె కుమార్తె మొబైల్ ఫోన్లు స్విచ్ఆఫ్లో ఉండటంతో బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు వచ్చి తాళం పగులగొట్టి లోనికి వెళ్లి చూశారు. రక్తం మడుగుల్లో పడి ఉన్న హష్మీని ఆసుపత్రికి తరలించగా ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
కాగా, హష్మీ కుమార్తె పొరుగు వ్యక్తితో కలిసి హడావుడిగా ఇంటి నుంచి వెళ్లడాన్ని చూసినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. దీంతో సాంకేతిక ఆధారాలతో వారిద్దరూ ఎక్కడ ఉన్నారో గుర్తించి అరెస్ట్ చేశారు. హష్మీ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.