భోపాల్: ఒక యువతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యింది. దీంతో కుటుంబ సభ్యుల తిట్ల నుంచి తప్పించుకునేందుకు కిడ్నాప్ డ్రామా ఆడింది. (Teen Fakes Kidnap) అయితే అసలు గుట్టును పోలీసులు రట్టు చేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల యువతి స్థానిక కాలేజీలో బీఏ చదువుతున్నది. ఫస్ట్ ఇయర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం తెలియగా ఆమె తప్పింది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే తనను మందలిస్తారని ఆ యువతి భయపడింది. దీంతో కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా తనను కిడ్నాప్ చేశారంటూ గుర్తు తెలియని నంబర్ నుంచి తండ్రికి ఫోన్ చేసింది. కాలేజీ సిబ్బంది తనను గుడి వద్ద దించగా ఇంటికి వచ్చేందుకు ఆటో ఎక్కినట్లు తెలిపింది. అయితే ఆటో డ్రైవర్ నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడని, నోటి వద్ద క్లాత్ ఉంచడంతో స్పృహ తప్పినట్లు తండ్రికి చెప్పింది.
కాగా, ఈ విషయం తెలుసుకున్న ఆ యువతి తండ్రి చాలా ఆందోళన చెందాడు. శుక్రవారం రాత్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆ యువతి చెప్పిన గుడి ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. అయితే ఆమె అక్కడి నుంచి ఆటోలో వెళ్లినట్లు ఎక్కడా కనిపించలేదు. దీంతో అన్ని పోలీస్ స్టేషన్లను అలెర్ట్ చేశారు.
మరోవైపు ఇండోర్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉజ్జయినిలోని రెస్టారెంట్లో ఒక యువతి ఒంటరిగా కూర్చొని ఉన్నట్లు పోలీసులకు తెలిసింది. తండ్రి ఇచ్చిన ఫొటోతో ఆమెను సరిపోల్చుకున్నారు. మహిళా పోలీసుల సహాయంతో ఆ యువతిని ఇండోర్కు తీసుకువచ్చారు. ఆమె బ్యాగ్ను తనిఖీ చేయగా ఇండోర్ నుంచి ఉజ్జయినికి బస్సులో ప్రయాణించిన టికెట్, రెస్టారెంట్ బిల్లు అందులో ఉన్నాయి.
పోలీసులు ఆ యువతిని నిలదీయగా అసలు విషయం చెప్పింది. పరీక్షలో ఫెయిల్ కావడంతో ఇంట్లో తిడతారని భావించి కిడ్నాప్ డ్రామా ఆడినట్లు తెలిపింది. దీంతో ఆ యువతికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఆమెను అప్పగించారు.