బెంగళూరు: ఒక పేయింగ్ గెస్ట్ (పీజీ) హాస్టల్లో కలిసి నివసిస్తున్న ఒక జంట ఆ బిల్డింగ్ పైనుంచి కిందపడ్డారు. టెకీ అయిన యువతి మరణించగా ఆమె స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. (Techie Dead) కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. పుదుచ్చేరిలోని ఉలైవైక్కల్కు చెందిన 23 ఏళ్ల జనని, బెంగళూరులోని ఒక సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నది. పుదుచ్చేరిలోని నల్లతూరుకు చెందిన 30 ఏళ్ల మణిచవేలు ఒక లాజిస్టిక్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వైట్ఫీల్డ్లోని ఈసీసీ రోడ్డులో ఉన్న కో లివింగ్ పీజీ వసతి గృహంలో వీరిద్దరూ కలిసి నివసిస్తున్నారు.
కాగా, ఆదివారం ఉదయం జనని, మణిచవేలు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో పీజీ వసతి గృహం బిల్డింగ్ అంచు వైపు జనని వెళ్లింది. అక్కడి నుంచి కిందకు దూకే సమయంలో మణిచవేలును కూడా తనతో పాటు ఆమె లాగినట్లు తెలుస్తున్నది. దీంతో వీరిద్దరూ ఏడవ అంతస్తు నుంచి కింద పడ్డారు. తీవ్రంగా గాయపడిన జనని అక్కడికక్కడే మరణించింది.
మరోవైపు మణిచవేలు మాత్రం ఆ బిల్డింగ్ ముందున్న చెట్టు కొమ్మలపై పడిన తర్వాత కిందపడ్డాడు. దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. గాయపడిన అతడ్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. టెకీ జనని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. ఆ జంట మధ్య జరిగిన వాదనకు కారణంతో పాటు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.