న్యూఢిల్లీ : నిత్యం డెడ్లైన్లు, ప్రాజెక్టులు, టార్గెట్ల మధ్య తీవ్ర ఒత్తిడితో తల్లడిల్లే ఉద్యోగులకు విశ్రాంతి, ప్రశాంతత అవసరమని కంపెనీలు గుర్తిస్తున్నాయి. ఉద్యోగులకు కొద్దిరోజులు పని నుంచి విరామం కల్పించి వారు సేదతీరేందుకు అవకాశం ఇస్తే అద్భుతమైన ఉత్పాదకతను రాబట్టవచ్చని యోచిస్తున్నాయి. ఉద్యోగులు రీచార్జ్ అయ్యేందుకు షార్ట్ బ్రేక్స్ అవసరమని కూడా పలు అధ్యయనాలు స్పష్టం చేశాయి.
ఉద్యోగులు రీచార్జ్ అయ్యేందుకు వారికి ఏకంగా తొమ్మిది రోజుల పాటు పెయిడ్ లీవ్ ఇచ్చేందుకు ఓ కంపెనీ ముందుకొచ్చింది. టెక్ కంపెనీ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు స్వాగతిస్తున్నారు. పలు కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ మాస్ లేఆఫ్స్కు తెగబడుతున్న వేళ టెక్ కంపెనీ తమ ఉద్యోగుల కోసం ఏకంగా తొమ్మిది రోజుల పెయిడ్ లీవ్ మంజూరు చేయడం అభినందనీయమని టెకీలు పేర్కొంటున్నారు.
కాలిఫోర్నియాకు చెందిన టెక్ హైరింగ్ ప్లాట్ఫాం హ్యాకర్ర్యాంక్ అనే కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీలు నైపుణ్యంతో కూడిన డెవలపర్లను హైర్ చేయడంలో ఈ కంపెనీ కీలకంగా వ్యవహరిస్తుంది. హ్యాకర్ర్యాంక్ జులై 1 నుంచి జులై 9 వరకూ ఉద్యోగులు రిలాక్స్ అవడంతో పాటు రీచార్జ్ అయి తిరిగి విధులకు హాజరయ్యేలా పెయిడ్ లీవ్ను మంజూరు చేసింది. ఈ సమయంలో వచ్చే కాల్స్, ఈమెయిల్స్కు ఉద్యోగులు జులై 9 తర్వాత సమాధానం ఇచ్చే వెసులుబాటు కల్పించారు.
Read More :
AI | స్టెబిలిటీ ఏఐ సీఈవో సంచలన వ్యాఖ్యలు : మరో ఐదేండ్లలో ప్రోగ్రామర్లు కనిపించరు..!