న్యూఢిల్లీ, మార్చి 15: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాలను ఈపీఎఫ్వో భారీ ఎత్తున మూసేసింది. గతేడాది ఏప్రిల్-డిసెంబర్ వ్యవధిలో ఏకంగా 71.01 లక్షల ఖాతాలు మూతబడినట్లు సోమవారం లోక్సభలో కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో కరోనా వైరస్ ప్రభావం దృష్ట్యా దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలైన విషయం తెలిసిందే. కాగా, అంతకుముందు ఏడాది ఏప్రిల్-డిసెంబర్లో 66,66,563 ఖాతాలు మూతబడ్డాయని, నిరుడు 71,01,929 ఖాతాలు క్లోజ్ అయ్యాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ తెలిపారు. దీంతో 2020లో దాదాపు 4.5 లక్షల ఖాతా లు అధికంగా మూతబడినట్లు తేలింది. పదవీ విరమణ, ఉద్యోగాల మార్పులతోపాటు ఉద్యోగాలు పోవడం వల్ల ఈ ఖాతాలన్నీ మూసివేసినట్లు మంత్రి చెప్పారు.
గతేడాది ఏప్రిల్-డిసెంబర్లో ఈపీఎఫ్ ఖాతాల నుంచి రూ.73,498 కోట్లను సుమారు కోటీ 28 లక్షల ఖాతాదారులు వెనక్కీ తీసుకున్నారని గంగ్వార్ చెప్పారు. 2019 ఇదే వ్యవధిలో రూ.55,125 కోట్ల ఉపసంహరణలు జరిగాయన్నారు.
ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 వరకు రూ.27,532.39 కోట్ల పెట్టుబడులను ఈపీఎఫ్వో పెట్టిందని మంత్రి తెలిపారు. కాగా, ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన కింద 1.83 లక్షల సంస్థలు నమోదయ్యాయని, ఇందులో 15.30 లక్షల మంది ఉద్యోగులున్నారని చెప్పారు.