భోపాల్ : మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రిని ఓ టీ విక్రేత అడ్డగించి 2018 నుంచి తనకు బకాయిపడిన రూ.30,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. సెహోర్ జిల్లా ఇచావర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే కరణ్సింగ్ వర్మ కారులో వెళుతుండగా టీ విక్రేత అడ్డగించి తన బకాయిలను తక్షణమే క్లియర్ చేయాలని పట్టుబట్టాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సెహోర్ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత జిల్లా కావడం గమనార్హం. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
వర్మ సైతం తన నియోజకవర్గంలో పర్యటిస్తుండగా ఆయనకు ఈ చేదు అనుభవం ఎదురైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కరణ్ సింగ్ వర్మ టీ విక్రేతకు సొమ్ము ఇప్పటివరకూ చెల్లించలేదు. తాను ఈ మొత్తం బకాయిపడిన మాట వాస్తవమేనని మాజీ మంత్రి అంగీకరించారు. ఇక ఎన్నికల ఏడాది కావడంతో ప్రజలు తమకు కావాల్సిన పనులు చేసిపెట్టాలని ఎమ్మెల్యేలను కోరుతున్నారు.