TCS Nashik Case : మహారాష్ట్ర, నాసిక్లోని టీసీఎస్ క్యాంపస్లో జరిగిన లైంగిక వేధింపులు, మత మార్పిడుల కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేసులో కీలక నిందితురాలిగా ఉన్న నిదా ఎజా ఖాన్పై దర్యాప్తు సంస్థలు మరిన్ని అభియోగాలు మోపారు. ఈ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) నిదా ఎజా ఖాన్పై మరిన్ని అభియోగాలను సెషన్స్ కోర్టులో సమర్పించారు.
ఘటనలో బాధిత మహిళలపై నిదా ఖాన్ వేధింపులకు పాల్పడినట్లు తాజా అభియోగాల్లో పేర్కొన్నారు. ఆ మహిళల్ని తన ఇంటికి తీసుకెళ్లి, హిజాబ్ ఎలా ధరించాలో, నమాజ్ ఎలా చేయాలో నేర్పించినట్లు పేర్కొన్నారు. అలాగే, ఆ మహిళల ఫోన్లలో తన మతానికి సంబంధించిన యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసింది. అలాగే, మత పరమైన అంశాల్ని వారి ఫోన్లకు తరచూ పంపేది. బాధితుల్ని తీవ్ర ప్రభావానికి గురి చేసినట్లుగా భావిస్తూ, వీటికి సంబంధించిన ఆధారాల్ని సిట్ కోర్టుకు సమర్పించినట్లు తెలుస్తోంది. అలాగే, బలవంతంగా మతం మారాలని, పేర్లు కూడా మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు బాధిత మహిళలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాను చెప్పినట్లు చేస్తే.. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని వారికి నిదాఖాన్ హామీ ఇచ్చినట్లు సిట్ పేర్కొంది. బాధితుల్ని మానసికంగా ఒత్తిడి చేయడం, వారిని ఒంటరిగా ఉండేలా చూడటం వంటి పనులు చేసింది నిదా ఖాన్. మరోవైపు ఈ కేసులో నిదాఖాన్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై విచారణ జరిపిన నాసిక్ కోర్టు.. తీర్పును మే 2కు వాయిదా వేసింది. ప్రస్తుతం నిదా ఖాన్ పరారీలో ఉంది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉన్నందున కోర్టు నిదా ఖాన్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది.