TCS Nashik : నాసిక్ టీసీఎస్ లైంగిక వేధింపుల కేసులో కీలక నిందితురాలిగా ఉన్న నిదాఖాన్ ఇంకా పరారీలోనే ఉంది. ఆమె ఆచూకీ కనుగొనేందుకు ఇంకా పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరకు ఆమె భర్త చెప్పిన చోట కూడా ఆమె ఆచూకీ లభించలేదు. మహారాష్ట్ర, నాసిక్లోని టీసీఎస్ క్యాంపస్లో కొందరు సీనియర్ ఉద్యోగులు.. అక్కడి మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అలాగే, బలవంతంగా మతం మార్చేందుకు ప్రయత్నించారు.
దీంతో బాధిత మహిళలు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. మరో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ మాత్రం పరారీలో ఉంది. ఘటన జరిగి వారం రోజులు దాటిపోయినా ఆమె ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం పోలీసుల అంచనా ప్రకారం నిదాఖాన్ రెండు నెలల క్రితమే మహారాష్ట్రలోని ముంబ్రా ప్రాంతం చేరుకున్నట్లు అనుమానిస్తున్నారు. నిదాఖాన్ ఆచూకీ లభించకపోయినప్పటికీ ఆమె భర్త మాత్రం పోలీసులకు అందుబాటులోకి వచ్చాడు. నిదాఖాన్ కొంతకాలం క్రితమే బంధువుల ఇంటికి వెళ్లిపోయినట్లు చెబుతున్నాడు. ఆ ఇంటికి సంబంధించి వివరాలు ఇచ్చాడు. కానీ, పోలీసులు అక్కడికి వెళ్లేసరికి ఆ ఇంటికి తాళం వేసి ఉంది.
ఆమెతోపాటు ఇంట్లో ఉండే బంధువుల ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. అయితే, ఆమె ముంబ్రాలో ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కేసు విచారణ కోసం మూడు పోలీసు బృందాలు పని చేస్తున్నాయి. ఒక టీం ప్రస్తుతం ముంబ్రాలో ఉంది. అయితే, నిదాఖాన్ ప్రస్తుతం గర్భిణి అని, ఈ నేపథ్యంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇలాంటి వేధింపుల్ని తాము సమర్ధించబోమని టీసీఎస్ ప్రకటించింది.