చెన్నై: కరోనా వేళ మాస్క్ తప్పనిసరి. ఈ నిబంధన పాటించని వారికి పోలీసులు జరిమానా కూడా విధిస్తున్న విషయం తెలిసిందే. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో మాస్క్ ప్రధానమని డబ్ల్యూహెచ్వో కూడా చెప్పింది. బహిరంగ ప్రదేశాల్లో తిరగేవారు కచ్చితంగా మాస్క్ను ధరించాల్సిందే. గాలి ద్వారా వ్యాపించే కరోనాను నిలువారించాలంటే మాస్కే కీలకం. అన్ని అగ్రదేశాలు కూడా మాస్క్ సిద్ధాంతాన్ని పాటిస్తూనే ఉన్నాయి. ఇండియాలోనూ మాస్క్ను తప్పనిసరి చేశారు. కనీసం కరోనా మహమ్మారి అంతం అయ్యే వరకు మాస్క్ రూల్ తప్పదు. అయితే ఇవాళ తమిళనాడు సీఎం స్టాలిన్ .. మాస్క్ లేకుండా చెన్నై వీధుల్లో తిరుగుతున్నవారికి మాస్క్లు అందించారు. ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్ తరహాలోనే తమిళనాడులోనూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ సెక్రటేరియేట్ నుంచి క్యాంప్ ఆఫీసుకు వెళ్తున్న సమయంలో.. రోడ్డుపై వెళ్తున్న కొందరు మాస్క్లు లేకుండా తిరుగుతుండడాన్ని గమనించారు. ఆ సమయంలో తన కారును ఆపి.. సీఎం స్టాలిన్ మాస్క్లు లేని వారికి వాటిని అందించారు. కొందరికి ఆయనే స్వయంగా తొడిగారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్ను ధరించాలంటూ విజ్ఞప్తి చేశారు.