హైదరాబాద్ : హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఓ కశ్మీరీ మహిళకు బ్రెయిన్డెడ్తో గురైన చెన్నై యువకుడి గుండెను అమర్చి ప్రాణం పోశారు వైద్యులు. ప్రస్తుతం ఆ మహిళ పూర్తిగా కోలుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఏడాది జనవరి 26వ తేదీన ఆమెకు వైద్యులు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్కు చెందిన 33 ఏండ్ల మహిళ ఫాతిమా గతకొంత కాలం నుంచి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమెను చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. అయితే బాధిత మహిళకు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ తప్పనిసరి అని వైద్యులు స్పష్టం చేశారు. తమిళనాడులోని తిరుచ్చిలో ఓ 18 ఏండ్ల యువకుడు జనవరి 26వ తేదీన బ్రెయిన్ డెడ్కు గురయ్యాడు. ఆ యువకుడిని గుండెను దానం చేసేందుకు ఐశ్వర్య ట్రస్ట్ సభ్యులు ఆ కుటుంబాన్ని ఒప్పించారు. అనంతరం 350 కిలోమీటర్ల మేర గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి తిరుచ్చి నుంచి చెన్నై ఎంజీఎంకు గుండెను తరలించారు. అదే రోజు ఫాతిమాకు ఈ యువకుడి గుండెను అమర్చారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నది. గుండెను దానం చేసిన ఆ యువకుడి కుటుంబ సభ్యులకు ఫాతిమా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.