చెన్నై: తమిళనాడు ప్రభుత్వం ఇటీవల తెచ్చిన 12 గంటల షిఫ్ట్ బిల్లు (12-Hour Shift Bill)పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ బిల్లును ఉపసంహరించుకోవాలని సీఎం స్టాలిన్ భావిస్తున్నారు. దీని కోసం మిత్రపక్ష పార్టీలతో ఆయన సమావేశమై చర్చించనున్నారు. తమిళనాడు ప్రభుత్వం గతవారం ఫ్యాక్టరీల చట్టం 1948కు సవరణలు చేసింది. ప్రతిపక్షాల తీవ్ర విమర్శల మధ్య ఫ్యాక్టరీల (సవరణ) చట్టం 2023 బిల్లును శుక్రవారం అసెంబ్లీలో ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం ఫ్యాక్టరీలో పని చేసే కార్మికుల షిఫ్ట్ సమయాన్ని ప్రస్తుతం ఉన్న 8 గంటల నుంచి 12 గంటలకు పొడిగించారు. అయితే కార్మికుల మొత్తం పని గంటల్లో ఎలాంటి మార్పు ఉండదని అందులో పేర్కొన్నారు.
కాగా, కొత్త చట్టం ప్రకారం కార్మికులు వారంలో నాలుగు రోజులపాటు 12 గంటల చొప్పున పని చేసి మిగతా మూడు రోజులు వేతనంతో కూడిన సెలవు పొందవచ్చు. లేదా ఆ రోజుల్లో చేసిన పనికి ఓవర్ టైం డ్యూటీ కింద అదనంగా వేతనం పొందవచ్చు. అలాగే కొత్త బిల్లు ప్రకారం 12 గంటల షిఫ్ట్ అమలు చేసే ఫ్యాక్టరీలు తప్పనిసరిగా కార్మికుల నుంచి సమ్మతి పొందాలి. 12 గంటల డ్యూటీని ఎంచుకునే కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఫ్యాక్టరీలదే.
మరోవైపు తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, సీపీఎం ఈ బిల్లును తప్పుపట్టాయి. కార్మికుల పని దోపిడీకి ఇది వీలు కల్పిస్తుందని, కార్మికుల హక్కులను ఈ బిల్లు హరిస్తుందని మండిపడ్డాయి. కార్మిక వ్యతిరేక చట్టంగా పేర్కొన్న ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ శుక్రవారం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. దీంతో విమర్శల నేపథ్యంలో ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు.