చెన్నై : తమిళనాడులో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో మహమ్మారితో బాధపడుతూ అత్యధికంగా 468 మంది మరణించారు. ఒక్కరోజులోనే 34,285 తాజా పాజిటివ్ కేసులు నమోదవడంతో యాక్టివ్ కేసుల సంఖ్య మూడు లక్షలు దాటింది. ఇక కరోనా హాట్ స్పాట్ గా మారిన చెన్నైలో 4041 కొత్త కేసులు నమోదవగా ఒక్కరోజులోనే 88 మంది ప్రాణాలు కోల్పోయారు.
చెన్నై, కోయంబత్తూర్ సహా రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ప్రతిరోజూ 1000 నుంచి 2000 లోపు తాజా కేసులు వెలుగుచూస్తుండటంతో అధికారులు మహమ్మారి కట్టడికి శ్రమిస్తున్నారు. మరోవైపు కరోనాతో బాధపడుతున్న రోగులు చివరి నిమిషంలో ఆస్పత్రులకు వస్తుండటంతోనే మరణాలు అధికంగా ఉండటం, ఐసీయూల్లోకి తరలించడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రి డీన్ ఈ. రాజన్ పేర్కొన్నారు.