చెన్నై: తమిళనాడు మాజీ సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికళకు చిక్కులు వీడటం లేదు. అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభించిన విడుదలైన ఆమెను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. జయ లలిత మరణాంతరం 2017లో కొడనాడ్ ఎస్టేట్లో జరిగిన దోపిడీ, హత్యలపై శశికళను గురువారం ప్రశ్నించనున్నారు. ఈ మేరకు ఆమెకు సమన్లు జారీ చేశారు. కాగా, పోలీస్ సమన్లు అందుకున్నట్లు శశికళ అనుచరులు తెలిపారు. చెన్నై టీనగర్లోని ఆమె నివాసంలోనే గురువారం ఉదయం 10.30 గంటలకు పోలీసులు ప్రశ్నించనున్నట్లు చెప్పారు. వెస్ట్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ సుధాకర్ నేతృత్వంలోని పోలీసు బృందం కొడనాడ్ ఎస్టేట్లో దోపిడీ, హత్యలపై శశికళను ప్రశ్నిస్తారని వెల్లడించారు.
కాగా, నీలగిరి జిల్లాలోని కొడనాడ్ టీ ఎస్టేట్లో 900 ఎకరాల మేర ఉన్న ఆస్తులను జయ లలిత, శశికళ, ఆమె బంధువులు కలిసి 1990లో సంయుక్తంగా పలు వాటాలుగా కొనుగోలు చేశారు. సీఎంగా ఉన్న జయ లలిత 2016 డిసెంబర్లో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. దీంతో జయ లలిత ఆస్తులకు తామే వారసులమంటూ పలువురు పోటీ పడ్డారు.
ఈ నేపథ్యంలో 2017 ఏప్రిల్ 23న రాత్రి వేళ పది మంది వ్యక్తులు కొడనాడ్ ఎస్టేట్లోకి చొరబడ్డారు. సెక్యూరిటీ గార్డు ఓం బహదూర్ను హత్య చేశారు. ఎస్టేట్ బంగ్లాలో జయలలిత, శశికళ వినియోగించే గదుల్లోకి చొరబడి పలు పత్రాలు, ఇతర వస్తులను చోరీ చేశారు. ఏప్రిల్ 28న ఈ కేసులోని ఇద్దరు ప్రధాన నిందితులు వేర్వేరుగా రోడ్డు ప్రమాదాల్లో మరణించడం మిస్టరీగా మారింది. జయ లలిత కారు డ్రైవర్ సీ కనకరాజ్ సేలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కేరళకు వెళ్తున్న కేవీ సాయన్ వాహనం ప్రమాదానికి గురి కాగా తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. అయితే ఆయన భార్య, కుమార్తె ఆ ప్రమాదంలో చనిపోయారు.
మరోవైపు కొడనాడ్ ఎస్టేట్లో జరిగిన దోపిడీ, హత్య ఘటనపై కేసులు నమోదయ్యాయి. 2019 అక్టోబర్ నుంచి నీలగిరి జిల్లా సెషన్స్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్నది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక బృందం అన్నాడీఎంకే ఎమ్మెల్యే వీపీ అరుకుట్టి, ఆ పార్టీ అమ్మ పేరవై కార్యకర్త రవిని కోయంబత్తూరులో విచారించింది. అలాగే శశికళ మేనల్లుడు వివేక్ జయరామన్ను కూడా గత ఏడాది డిసెంబర్లో దర్యాప్తు అధికారులు ప్రశ్నించారు. తాజాగా శశికళను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.