చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్-NEET) అని రాసి ఉన్న గుడ్డును జనానికి చూపించారు. గుడ్డు (ముట్టై) అన్న తమిళ పదానికి సున్నా అన్న అర్థం అక్కడ వాడుకలో ఉంది. ఈ నేపథ్యంలో నీట్ పీజీ కటాఫ్ను జీరో పర్సంటైల్కి కేంద్రం తగ్గించిన విషయాన్ని ఈ విధంగా ఆయన గుర్తు చేశారు. నీట్కు వ్యతిరేకంగా పోరాడుతున్న తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా సంతకాల సేకరణ ప్రచారాన్ని ప్రారంభించింది. డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ తొలి సంతకం చేశారు. నీట్కు వ్యతిరేకంగా 50 రోజుల్లో 50 లక్షల సంతకాలు సేకరించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపనున్నారు. తద్వారా తమిళనాడుకు నీట్ను మినహాయించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానించి రాష్ట్రపతికి పంపిన బిల్లుకు ఆమోదం కోసం పట్టుబట్టనున్నారు.
కాగా, నీట్కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు. నీట్ నుంచి ఎన్ఈపీ వరకు విద్యాహక్కులను కాలరాయడానికి ఫాసిస్టులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వీటిపై నిరంతరం పోరాడుతూనే ఉంటామని అన్నారు. నీట్ను నిషేధించాలన్న తమిళనాడు డిమాండ్ను విస్మరిస్తే జల్లికట్టు తరహాలో సామూహిక నిరసనలు చేపడతామని కేంద్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు నీట్కు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ ప్రచారంలో పాల్గొనాలని మాజీ సీఎం పళనిస్వామికి చెందిన అన్నాడీఎంకేతో సహా ఇతర పార్టీలకు ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చారు. ‘తమిళనాడు హక్కులను కాపాడేందుకే బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చామని అన్నాడీఎంకే చెబుతోంది. కాబట్టి వారిని కూడా ప్రచారంలో భాగస్వాములు కావాలని నేను అభ్యర్థిస్తున్నా’ అని ఆయన అన్నారు.