చెన్నై: తమిళనాడులో ఇవాళ కంప్లీట్ లాక్డౌన్ కొనసాగుతున్నది. దాంతో రాజధాని చెన్నై సహా పలు పట్టణాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతిరోజు నైట్ కర్ఫ్యూ, ఆదివారాల్లో కంప్లీట్ లాక్డౌన్ను అమలు చేస్తున్నది. జనవరి 31 వరకు ఈ నైట్ కర్ఫ్యూ, కంప్లీట్ లాక్డౌన్ కొనసాగనుంది.
ప్రతిరోజు రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 1,31,007 కొవిడ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 36,967 కరోనా మరణాలు సంభవించాయి. అదేవిధంగా 27,47,974 మంది మహమ్మారి బారినపడి కోలుకున్నారు. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి ఎంఏ సుబ్రమణియన్ ఆదివారం ఉదయం ఈ వివరాలను వెల్లడించారు.
లాక్డౌన్లో వీటికి అనుమతి..
ఆదివారాలు కంప్లీట్ లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికి పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు వెళ్లొచ్చట. అయితే, పోలీసులు ఎక్కడ అడిగినా సంబంధిత ఇన్వెటేషన్ కార్డును చూపించాలి. అదేవిధంగా పెండ్లిళ్లకు 100 మందికి మించి హాజరు కాకూడదు. ఆస్పత్రులు, ఫార్మసీలు, ఏటీఎం కేంద్రాలు, పెట్రోల్, డీజిల్ బంకులు వంటి అత్యవసర సేవలు యథావిథిగా కొనసాగుతాయి. రెస్టారెంట్లు ఫుడ్ డెలివరీ సేవలు అందించేందుకు అనుమతి ఉంది. అన్ని ప్రార్థనా మందిరాలు మూసి ఉంటాయి.