Tamil Nadu : గోవధపై నిషేధం విషయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశంలో గోవధను నిషేధిస్తూ గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తమిళనాడు సెక్రెటరీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. మద్రాస్ హైకోర్టు తీర్పు.. తమిళనాడు యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్, 1958కి వ్యతిరేకంగా ఉందని తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.
తమిళనాడు చట్టం ప్రకారం పదేళ్లు దాటిన గోవులను, సంతానోత్పత్తికి పనికిరాని గోవులను, వ్యవసాయం వంటి వాటిలో పనికి ఉపయోగపడని వాటిని వధించవచ్చు. దీనికి సంబంధిత అథారిటీ నుంచి సర్టిఫికెట్ తీసుకుంటే చాలు. అలాగే, ఇతర కేంద్ర చట్టాలను కూడా తమిళనాడు ప్రభుత్వం ప్రస్తావించింది. దీని ప్రకారం నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని వధించవచ్చని, కానీ, పూర్తిగా గోవధపై నిషేధం విధించే చట్టం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ పిటిషన్లో హిందూ మక్కల్ కచ్చి సంస్థ యూత్ విభాగం సెక్రెటరీ కే.సూర్య, రాష్ట్ర డీజీపీని ప్రతివాదులుగా పేర్కొన్నారు. అంతకుముందు కే.సూర్య తరఫున గత మే 27న సుప్రీంకోర్టులో అడ్వకేట్ పీవీ యోగేశ్వరన్ పిటిషన్ దాఖలు చేశారు.
తమిళనాడులో బక్రీద్ సందర్భంగా ఒక్క గోవును కూడా వధించకుండా చూడాలని కేవియట్ పిటిషన్లో కోరారు. దీనికి అనుగుణంగా సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఒక్క గోవును వధించకూడదని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ తాజాగా విజయ్ ఆధ్వర్యంలోని టీవీకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.