MK Stalin | అవినీతి ఆరోపణలతో జైలు పాలైన మంత్రి సెంథిల్ బాలాజీని తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి నేరుగా బర్తరఫ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం మరో వివాదానికి దారి తీసింది. గవర్నర్ ఆర్ ఎన్ రవి నిర్ణయంపై సీఎం ఎంకే స్టాలిన్ భగ్గుమన్నారు. తమ క్యాబినెట్ మంత్రిని నేరుగా బర్తరఫ్ చేయడానికి గవర్నర్ ఆర్ఎన్ రవికి అధికారం లేదని తేల్చి చెప్పారు. దీనిపైతమ ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తుందని గురువారం ప్రకటించారు.
‘సెంథిల్ బాలాజీ క్యాష్ ఫర్ జాబ్, మనీ లాండరింగ్ తోపాటు పలు అవినీతి కేసుల్లో తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారు. మంత్రిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. దర్యాప్తు ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారు. న్యాయ ప్రక్రియకు అడ్డు తగులుతున్నారు` అని రాజ్ భవన్ గురువారం ఒక ప్రకటన చేసింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేస్తున్న క్రిమినల్ కేసులో మంత్రి ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అవినీతి నిరోధక చట్టం, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద ఆయనపై పలు క్రిమినల్ కేసుల్లో రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
`అయినప్పటికీ మంత్రి వర్గంలో సెంథిల్ బాలాజీని కొనసాగించడంపై సహేతుకమైన ఆందోళనలు ఉన్నాయి. నిష్పాక్షిక దర్యాప్తుతోపాటు న్యాయ ప్రక్రియపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం పనితీరు దెబ్బ తినవచ్చు. ఈ పరిస్థితుల్లో తక్షణం క్యాబినెట్ నుంచి సెంథిల్ బాలాజీని తొలగిస్తున్నాం` అని రాజ్ భవన్ తన ప్రకటనలో తెలిపింది.