చెన్నై, ఆగస్టు 21: ఉచిత పథకాల అంశంపై బీజేపీ లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీల విమర్శల పర్వం కొనసాగుతున్నది. తాజాగా తమిళనాడు ఆర్థిక మంత్రి పి త్యాగరాజన్ ప్రధాని మోదీ, బీజేపీకి ప్రశ్నల వర్షం కురిపించారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉచితాల ప్రకటనలు దేవుడి చేతి నుంచి ఏమైనా ఊడిపడుతున్నాయా? అని ప్రశ్నించారు. యూపీలోని బీజేపీ ప్రభుత్వం బస్సుల్లో ఉచిత ప్రయాణాల ప్రకటనను ప్రస్తావించిన ఆయన.. దీనిపై ప్రధాని మోదీ సానుకూలంగా ఉన్నారా? అని నిలదీశారు. ‘తమిళనాడులో తమకంటే ముందు అన్నాడీఎంకే ప్రభుత్వం లక్ష మంది మహిళలకు సగం ధరకే స్కూటర్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని మోదీనే ప్రారంభించారు. మరి అప్పుడు ఆయన ఆలోచన ఏంటి?’ అని ప్రశ్నించారు. తమకో న్యాయం, వేరొకరికి మరో న్యాయం అన్నట్టుగా మోదీ ప్రభుత్వ తీరు ఉన్నదని అన్నారు. తాము ఉచితాలు ఇస్తే.. దేవుడేదో ఇచ్చినట్టుగా ప్రశ్నించడానికి లేదన్నట్టుగా బీజేపీ వ్యవహరిస్తున్నదని, అదే ఇతర ప్రభుత్వాలు ఇస్తే.. అవి చెడ్డ ఉచితాలు అని, అభివృద్ధికి ప్రతిబంధకాలని చెప్పడం ప్రధాని మోదీ ద్వంద్వ వైఖరికి నిదర్శమని మండిపడ్డారు.
కార్పొరేట్ల రుణమాఫీలే ఉచితాలు..
కార్పొరేట్లకు చేస్తున్న రుణమాఫీలే ఉచితాలని.. పేదలకు, బలహీనవర్గాల ప్రజలకు ఉన్నతి కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎంతమాత్రం ఉచితాలు కావని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ పేర్కొన్నారు. కానీ పేదలకు లబ్ధి చేకూర్చే పథకాల పట్ల బీజేపీ ఏడుస్తున్నదని మండిపడ్డారు. 2014లో ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా దేశంలోని ప్రతి పౌరుడికి రూ.15 లక్షలు’ హామీ అసలైన ‘ముఫ్త్ కీ రేవరీ’ అని, అయితే గద్దెనెక్కిన అనంతరం బీజేపీ ఆ హామీని కూడా జుమ్లాగా మార్చిందని అన్నారు.