చెన్నై: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో మెల్లగా విజృంభిస్తున్నది. కొద్ది రోజుల్లోనే 17 రాష్ట్రాలకు వ్యాపించింది. ఇప్పటి వరకు దేశంలో 350కిపైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా థర్డ్ వేవ్పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు డాక్టర్లు రహస్యంగా బూస్టర్ డోస్ తీసుకుంటున్నారు. తమిళనాడులోని పలు చోట్ల వైద్యులు ముందు జాగ్రత్తగా కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇదంతా అనధికారికంగా, రహస్యంగా జరుగుతున్నట్లు తెలుస్తున్నది.
తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖకు చెందిన అధికారి ఒకరు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. ప్రైవేట్తోపాటు ప్రభుత్వ ఆసుపత్రులలో పని చేసే డాక్టర్లు సీక్రెట్గా బూస్టర్ డోస్ పొందుతున్నారని చెప్పారు. రెండు టీకాల మధ్య గ్యాప్ తక్కువగా ఉన్న వైద్యులు, బూస్టర్ డోసుకు మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నవారు కోవాగ్జిన్ను, కోవాగ్జిన్ రెండు టీకాలు తీసుకున్నవారు కోవిషీల్డ్ను బూస్టర్ డోస్గా తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
మరోవైపు కొందరు డాక్టర్లు బూస్టర్ డోస్ను సమర్ధిస్తున్నారు. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ శరీరంలో యాంటీబాడీల స్థాయిలు చాలా తక్కువగా ఉన్నట్లు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అధ్యయనాల్లో తేలిందన్నారు. అందుకే బూస్టర్ డోసు అవసరమని స్పష్టం చేశారు.
కాగా, అనధికారికంగా టీకా మూడో డోసు తీసుకోవడం కేంద్ర ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ టీఎస్ సెల్వవినాయకం తెలిపారు. ఈ నేపథ్యంలో అనారోగ్య సమస్యలున్న వైద్యులు మాత్రం బూస్టర్ డోస్పై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.