MK Stalin : కేంద్ర సర్కారు (Union Govt) పైన, సీబీఎస్ఈ (CBSE) పైన తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదనపై ఆయన విమర్శలు గుప్పించారు. ఇది రాజకీయ ప్రేరేపిత చర్య అని, దేశ భాషా వైవిధ్యానికి తూట్లు పొడిచే ప్రయత్నమని మండిపడ్డారు. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా తీసుకొచ్చిన ఈ పాలసీని తమిళనాడు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నది.
ఈ నేపథ్యంలో స్టాలిన్ మరోసారి ఘాటుగా స్పందించారు. ఇది సాధారణ విద్యా సంస్కరణ కాదని, భారతీయ భాషలను ప్రోత్సహిస్తున్నామనే ముసుగులో హిందీని రుద్దేందుకు జరుగుతున్న ఆందోళనకర ప్రయత్నమని విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇతర ప్రాంతీయ భాషలను పక్కనపెట్టి హిందీకి అగ్రస్థానం కల్పిస్తోందని ఆరోపించారు. భాషా విధానం పేరుతో హిందీయేతర రాష్ట్రాల్లో హిందీని విస్తరించాలని చూస్తున్నారని, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు ఇది బలవంతంగా హిందీని నేర్పడమే తప్ప మరొకటి కాదని అన్నారు.
‘హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని విద్యార్థులు తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి దక్షిణాది భాషలను తప్పనిసరిగా నేర్చుకుంటారా..? అని’ అని స్టాలిన్ కేంద్రాన్ని ప్రశ్నించారు. కేంద్రీయ విద్యాలయాల్లో తమిళాన్ని తప్పనిసరి చేయడంలో విఫలమైన కేంద్రం, ఇప్పుడు రాష్ట్రాలకు భాషల గురించి నీతులు చెప్పడం ద్వంద్వ నీతికి పరాకాష్ఠ అని ఎద్దేవా చేశారు. ఈ విధానాన్ని అమలు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ఆర్థిక ప్రణాళికలు ఉన్నాయా..? అని నిలదీశారు.
త్రిభాషా విధానం వల్ల హిందీ మాట్లాడే విద్యార్థులకే ఉన్నత విద్య, ఉద్యోగాల్లో ప్రయోజనం చేకూరుతుందని, రాష్ట్రాల మధ్య అసమానతలు పెరుగుతాయని స్టాలిన్ హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యానిమేషన్, గేమింగ్ వంటి ఆధునిక రంగాల్లో విద్యార్థులకు నైపుణ్యాలు అందించాల్సిన ఈ తరుణంలో, వారిపై అదనపు భాషా భారాన్ని మోపడం సరికాదని అన్నారు. రాష్ట్రాల ఆందోళనలను కేంద్రం పట్టించుకోకపోవడం సమాఖ్య స్ఫూర్తికి, కోట్ల మంది భాషా గుర్తింపునకు జరిగిన అవమానమని స్టాలిన్ వ్యాఖ్యానించారు.