చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) కొత్త పథకాన్ని ప్రారంభించారు. ‘మక్కలుదన్ ముతల్వార్’ స్కీమ్ ద్వారా ప్రజల ఫిర్యాదులు 30 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. తన ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ పథకం అమలవుతుందని అన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో ‘మక్కలుదన్ ముతల్వార్’ అనే కొత్త కార్యక్రమాన్ని సీఎం ఎంకే స్టాలిన్ సోమవారం ప్రారంభించారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడడం, విధానపరమైన జాప్యాలు తగ్గించడం ఈ పథకం ఉద్దేశమని తెలిపారు. త్వరితగతిన ఫిర్యాదులను పరిష్కరించడంతోపాటు సమర్పించాల్సిన పత్రాల సంఖ్యను తగ్గిస్తామని చెప్పారు. శిబిరాల్లో అందిన అర్జీలన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‘30 రోజుల్లో ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం. నా ప్రత్యక్ష పర్యవేక్షణలో పథకం అమలు చేస్తాం. వికలాంగులు, వృద్ధుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతాం’ అని స్టాలిన్ అన్నారు.
కాగా, ‘మక్కలుదన్ ముతల్వార్’ స్కీమ్ కోసం తమిళనాడు వ్యాప్తంగా రెండు దశల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. తుపాను వల్ల బాగా ప్రభావితమైన చెన్నై, చెంగల్పట్టు, తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో తొలి దశ క్యాంపులు ఏర్పాటు చేస్తారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణాలు, గ్రామ పంచాయతీల్లో సుమారు 1,745 ఫిర్యాదు పరిష్కార శిబిరాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు.