చెన్నై : వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ శనివారం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని సభ మూజువాణి ఓటుతో సభ ఆమోదం పొందింది. రైతు ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత ఏడాదిగా నిరసన బాట పట్టిన రైతులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించాలని ఈ సందర్భంగా జరిగిన చర్చలో పాల్గొన్న సీఎం స్టాలిన్ కేంద్రాన్ని కోరారు.
వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, ఈ చట్టాలతో వ్యవసాయ రంగం నిర్వీర్యమవుతుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. సాగు చట్టాలతో రైతులకు మేలు జరగకపోగా ఇవి సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని, రాష్ట్రాల అధికారాలను హరించేలా ఉన్నాయని అన్నారు. గతంలో ఏఐఏడీఎంకే ప్రభుత్వం సాగు చట్టాలపై ఇలాంటి తీర్మానం చేయలేదని మండిపడ్డారు. ఇక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ, ఏఐఏడీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి చర్చ చేపట్టకుండా సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తొందరపాటుతో తీర్మానాన్ని ఆమోదించిందని ఏఐఏడీఎంకే సభ్యులు ఆరోపించారు.