ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ, బీజేపీ జాతీయ కార్యదర్శి పంకజా ముండే (Pankaja Munde) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో రెండు నెలలు సెలవు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే కాంగ్రెస్లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను పంకజా ముండే ఖండించారు. అజిత్ పవర్ వర్గం ప్రభుత్వంలో చేరడంపై చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు తెలిపారు. అయితే భయం వల్ల వారు దీని గురించి మాట్లాడటం లేదన్నారు. అవినీతిని సహించబోనన్న నరేంద్ర మోడీ నినాదాన్ని ప్రజలు ఇష్టపడ్డారని ఎద్దేవా చేశారు. అవినీతి ఆరోపణలున్న ఎన్సీపీ నేతలు ప్రభుత్వంలో చేరడం పట్ల తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె అయిన పంకజా ముండే మీడియాతో శుక్రవారం మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని తాను కలిసినట్లు ప్రసారం చేసిన ఛానెల్పై పరువు నష్టం కేసు వేస్తానని అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు వదంతులు ఎందుకు వస్తున్నాయని ఆమె ప్రశ్నించారు. బీజేపీ సమావేశాలకు తనను ఆహ్వానించకపోవడం వల్లనే ఇలాంటి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తనను ఎందుకు విస్మరించారు అన్నది పార్టీనే సమాధానం చెప్పాలన్నారు.
కాగా, 20 ఏళ్లుగా పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేశానని, అయినా తన నీతిని ప్రశ్నిస్తున్నారని, పుకార్లు పుట్టిస్తున్నారని పంకజా ముండే ఆవేదన వ్యక్తం చేశారు. సోనియాగాంధీని, రాహుల్ గాంధీని ఎప్పుడూ కలువలేదని దీనిపై ప్రమాణం చేస్తానని అన్నారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. ఏది చేసినా బహిరంగంగానే చేస్తానని అన్నారు.
మరోవైపు బీజేపీ సిద్ధాంతం తన రక్తంలో ఉందన్న పంకజా ముండే, అటల్ బిహారీ వాజ్పేయి, గోపీనాథ్ ముండే మార్గంలో తాను నడుస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ తన సిద్ధాంతాల విషయంలో రాజీపడాల్సి వస్తే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి ఎప్పుడూ వెనుకాడబోనన్నది గతంలోనే చెప్పానన్నారు. రెండు నెలలు సెలవుపై వెళ్తున్నట్లు ఆమె వెల్లడించారు.