న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) కేంద్ర ప్రభుత్వ తీరుపై సెటైర్ వేశారు. నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ స్కీమ్ను ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. నిరుపయోగ ఆస్తులను అమ్మి 6 లక్షల కోట్ల ఆదాయం రాబట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆ విషయాలను తప్పుపడుతూ రాహుల్ ఇవాళ ఓ ట్వీట్ చేశారు. కేంద్రం ఆస్తులను అమ్మే బిజీలో ఉందన్నారు. మీ జాగ్రత్త మీరే చూసుకోవాలని రాహుల్ తెలిపారు. దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఇది ఆందోళన కలిగిస్తోందని, వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలని, తదుపరి వేవ్ రాకుండా ఉండాలంటే ఈ చర్య తప్పదని, మీరంతా మీ జాగ్రత్తల్లో ఉండాలని, ఎందుకంటే ప్రభుత్వం ఆస్తులను అమ్మే పనిలో బిజీగా ఉన్నట్లు రాహుల్ విమర్శించారు. కోవిడ్తో మరణించినవారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రభుత్వం సుమారు 4 లక్షల కోట్లు ఆర్జిస్తోందన్నారు.