BCB : భారత్తో క్రికెట్ సంబంధాలు పునరుద్దరణ కోసం బంగ్లాదేశ్ బోర్డు(BCB) ప్రయత్నాలు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో ఆడబోమని బెట్టుచేసి చివరకు వేటుకు గురవ్వడంతో బుద్ది తెచ్చుకున్న బీసీబీ.. ద్వైపాక్షకి సిరీస్కు సిద్ధమంటోంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్లో టీమిండియా వస్తే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని బంగ్లా క్రికెట్ బోర్డు సెక్యూరిటీ కమిటీ చైర్మన్ సయీద్ ఇబ్రహీం అహ్మద్(Sayeed Ibrahim Ahmed) అన్నాడు. భారత జట్టుతో సిరీస్ జరిపేందుకు తాము ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోబోమని సయీద్ పేర్కొన్నాడు.
షెడ్యూల్ ప్రకారం నిరుడు జూన్లో టీమిండియా వన్డే సిరీస్ కోసం బంగ్లాదేశ్కు వెళ్లాలి. కానీ, అంతర్గత సంక్షోభం కారణంగా పర్యటన వాయిదా పడింది. దాంతో, షెడ్యూల్ను ఈ ఏడాది(2026) సెప్టెంబర్కు మార్చారు. కానీ, బంగ్లాలో హిందువులపై హింస, దాడులు.. ఐపీఎల్ నుంచి పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను తొలగించడం వంటివి ఇరుబోర్డుల మధ్య దూరాన్ని పెంచాయి.
దానికి తోడు.. ఇండియాలో టీ20 ప్రపంచకప్ను బాయ్కాట్ చేయడం ద్వారా బంగ్లాదేశ్ బోర్డుకు, బీసీసీఐకి మధ్య అంతరం మరింత ఎక్కువైంది. ఈ నేపథ్యంలో.. ఆర్థికంగా నష్టపోయిన తమ బోర్డుకు ఊతమిచ్చేందుకు సెప్టెంబర్లో తమదేశానికి టీమిండియా వస్తే బాగుండని బీసీబీ కోరుకుంటోంది. అందుకే.. బీసీబీ భద్రతా కమిటీ ఛైర్మన్ సయీబ్ భద్రత కల్పించేందుకు మేము సిద్ధమని ప్రకటించాడు.
BCB prepared to enhance security for proposed India tour in September
Additionally, Mirpur, Chattogram and Sylhet have emerged as the proposed venues for Asia Cup 2027 pic.twitter.com/jfKdeSW7Yg
— Cricbuzz (@cricbuzz) July 7, 2026
‘పర్యాటక జట్టుకు భద్రత అనేది ఆందోళనకలిగించే విషయం. ముఖ్యంగా భారత్ వంటి పెద్ద జట్ల భద్రతకు ప్రాధాన్యం ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే.. ఇప్పటివరకూ బీసీసీఐతో మా బోర్డు సభ్యులు మాట్లాడలేదు. కానీ, షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్లో టీమిండియా వస్తే.. ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకునే పూచీ మాది. ద్వైపాక్షిక సిరీస్ను పక్కాగా, నియంత్రణతో కూడిన వాతావరణంలో, భారీ భద్రత నడుమ జరిపేందుకు ప్రాధాన్యమిస్తాం. భద్రత పెంపు అనేది పరిస్థితిని బట్టి మారుతుంది.

భారత జట్టు వస్తే మాత్రం కచ్చితంగా బందోబస్తును పెంచేందుకు సిద్ధమే. అయినా కూడా ఇప్పటివరకూ బీసీసీఐ నుంచి పర్యటనకు సంబంధించి ఎటువంటి వార్త అందలేదు’ అని సయీద్ వెల్లడించాడు. స్వదేశంలో వచ్చే ఏడాది ఆసియా కప్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పాడు. చివరిసారిగా 2016లో ఈ మెగా టోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చింది.