ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన శివసేన పేరు, విల్లు బాణం గుర్తును సీఎం షిండే వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) శుక్రవారం కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ అంశంపై ఏం చేయాలి అన్నదానిపై ఉద్ధవ్ ఠాక్రే తలమునకలయ్యారు. అయితే ఎంవీఏ కూటమిలో కీలకమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. విల్లు బాణం గుర్తును షిండే వర్గానికి వదిలేసి కొత్త ఎన్నికల చిహ్నాన్ని తీసుకోవాలని ఉద్ధవ్ ఠాక్రేకు సూచించారు. ఈసీ చర్య వల్ల పెద్దగా ప్రభావం ఉండదని, కొత్త చిహ్నాన్ని ప్రజలు ఆమోదిస్తారని పవార్ అన్నారు. ఎన్నికల కమిషన్ ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఇక చర్చకు అవకాశం ఉండదని చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్త చిహ్నాన్ని అంగీకరించాలని ఉద్ధవ్ ఠాక్రేకు సూచించారు. పాత గుర్తు మాదిరిగానే కొత్త గుర్తును ప్రజలు ఆదరిస్తారని అన్నారు.
కాగా, గతంలో ఇందిరా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి సంఘటనను ఎదుర్కోందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ గుర్తు చేశారు. కాంగ్రెస్కు గతంలో ‘కాడితో ఉన్న రెండు ఎద్దులు’ గుర్తు ఉండేదని తెలిపారు. అయితే కాంగ్రెస్ దానిని కోల్పోయిందని, ఆ తర్వాత కొత్త చిహ్నంగా ‘హస్తం’ గుర్తును స్వీరించిందని చెప్పారు. ప్రజలు ఆ గుర్తును ఆమోదించి చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని ఆదరించిన సంగతిని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గం తీసుకునే కొత్త చిహ్నాన్ని కూడా ప్రజలు అదే విధంగా అంగీకరించి ఆదరిస్తారని వెల్లడించారు.
మరోవైపు శివసేన అధికార పేరు, విల్లు బాణం గుర్తును షిండే వర్గానికి ఈసీ కేటాయించడంపై ఉద్ధవ్ ఠాక్రే వర్గం మండిపడింది. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బీజేపీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నదని ఆరోపించింది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిందని విమర్శించింది. ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో శనివారం అత్యవసర సమావేశానికి ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు. తదుపరి కార్యాచరణపై తన వర్గం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతో చర్చించనున్నారు.